గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను దశలవారీగా తొలగిస్తామని, అమరావతి రోడ్ ఇరువైపులా ఆక్రమణలను స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్నామని, వెంటనే పూడిక కూడా తీయాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ లాడ్జి సెంటర్ నుండి హోసన్నా మందిరం వరకు చేపట్టిన డ్రైన్, రోడ్ ఆక్రమణల తొలగింపును పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైన్లు, రోడ్లు ఇష్టానుసారం ఆక్రమణలు చేయడం వలన డ్రైన్లలో పూడిక తీయడానికి వీలు లేకుండా ఉందని, అలాగే రోడ్ల ఆక్రమణల వలన ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకంగా ఉందన్నారు. ఇప్పటికే ఓల్డ్ క్లబ్ రోడ్, పట్నం బజార్, జిటి రోడ్, రైల్వే స్టేషన్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించామని దశల వారీగా నగరంలో అన్ని ప్రాంతాల్లో తొలగిస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. డ్రైన్ ముందుకు ఏ విధమైన షాప్ లు లేదా బండ్లు పెట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, టిపిఎస్ సత్యనారాయణ, ఏఈ చైతన్య, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News