గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వ సేవలను నిర్దేశిత గడువులోగా అందించడంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తీసుకుంటామని, త్రాగునీటి ట్యాప్ కనెక్షన్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై ముగ్గురు ఏఈలు, నలుగురు వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించే ఆర్జీలను అధికారులు తప్పనిసరిగా సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) మేరకు నిర్దేశిత గడువు 15 రోజులులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సదరు ఆర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు పంపాలన్నారు. కాని కొందరు అధికారులు, కార్యదర్శులు ఎస్ఎల్ఏ గడువు చేరువగా వచ్చిన అనంతరం కమిషనర్ లాగిన్ కి పంపడం గమనించామన్నారు. ఆర్జీలను ఎస్ఎల్ఏ లోపు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఏఈలు పి.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావు, బి.చైతన్యలకు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులు వి.రాంబాబు నాయక్, ఎస్.నాగరాజు, ఏ.వెంకటేశ్వర్లు, ఎన్.వేణుగోపాల్ రావులకు క్రమశిక్షణ చర్యలు, పెనాల్టి విధింపు ఎందుకు చేపట్టకూడదో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామన్నారు. వివరణ సంతృప్తిగా లేకుంటే విధుల నుండి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.
Prajavartha Online Telugu News