విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్ కార్పొరేషన్ సిబ్బందితో నివాళులర్పించారు. ముందుగా పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమేలలు వేసి మహాత్ములను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కోసం శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన కృషి వెలకట్టలేనిదని, భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రాంతీయ భాషలు మరియు సాంస్కృతులను పరిరక్షించడంలో ఆయన పాత్ర కీలకమైనదని, ఆంధ్రుల ఆశయ సాధన కోసం ఆయన చేసిన త్యాగానికి పొట్టి శ్రీరాములు మరణాంతరం అమరజీవి అనే బిరుదు ప్రధానం చేశారని, తెలిపారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారని, ఇటువంటి మహనీయుల వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవటమే కాకుండా భావితరాలకు వారి గురించి తెలియజేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్ )డాక్టర్ డి చంద్రశేఖర్, మేనేజర్ ఏ యు బి శర్మ, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News