-ప్రజలందరూ చికెన్ మరియు గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు : జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, ప్రజలందరూ చికెన్ మరియు కోడిగుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారి, డిఆర్ఓ నరసింహులు తదితరులతో కలిసి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై వస్తున్న అపోహలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, ప్రజలందరూ చికెన్, కోడిగుడ్ల ను నిరభ్యంతరంగా తినవచ్చునని ప్రజలకు సూచించారు. మన మండలాలలో గాని, మన జిల్లాలో గాని బర్డ్ ఫ్లూ లేదని అన్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ పై వస్తున్న అపోహల కారణంగా పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని, దీనిపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు నేడు బైరాగి పట్టెడ లోని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు చికెన్ మరియు క్రోడిగుడ్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ( NECC) పౌల్ట్రీ బ్రీడర్స్ కో ఆర్డినేషన్ అసోసియేషన్, జిల్లా పౌల్ట్రీ రైతుల సంఘం మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నామని అన్నారు.
పశుసంవర్ధక శాఖ అధికారి రవి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ రావడంతో అక్కడ జిల్లాలోని ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినడానికి భయపడడం జరిగిందనీ, మన జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదని, నేడు సోమవారం ప్రజలలో దీనిపై అవగాహన పెంచేందుకు బైరాగి పట్టెడలోని జగ్జీవన్ రామ్ పార్కు నందు చికెన్ అండ్ ఎగ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా చికెన్ మరియు కోడిగుడ్లు తినవచ్చునని అన్నారు.
Prajavartha Online Telugu News