ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్ లో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఎపి గిరిజన సహకార సంఘం ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్స్ ను మంగళవారం సందర్శించారు. అరకు కాఫీ తాగటంతో పాటు అరకు బ్రాండ్ కాఫీ ప్యాకెట్ ను కొనుగోలు చేశారు. అలాగే కాఫీ స్టాల్స్ సిబ్బంది తో కాసేపు మాట్లాడి అరకు కాఫీ కి దక్కుతున్న ఆదరణ గురించి అడిగి తెలుకున్నారు. అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహించేందుకు పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు చొరవ చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లాకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ధన్యవాదములు తెలిపారు. పార్లమెంట్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో అరకు కాఫీ అందుబాటులోకి రావడం గిరిజన సమాజానికి లభించిన గొప్ప గౌరవమన్నారు. అరకులోయ గిరిజనులు ఎంతో శ్రమించి ఉత్పత్తి చేసే అరకు కాఫీ రుచి దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా వుందన్నారు.
Prajavartha Online Telugu News