-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి
-మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాలల పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
నేల ఆరోగ్యం, విత్తనోత్పత్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మట్టి నమూనాలను పరీక్షించి, రైతులకు భూసార పరీక్ష కార్డులు (సాయిల్ హెల్త్ కార్డ్లు, ఎస్హెచ్సి) పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో భూసార నిర్ధారణ నిమిత్తం 38,58,795 మట్టి నమూనాలను పరీక్షించగా 1,42,57,644 మంది రైతులకు లబ్ధి చేకూరిందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగిలిన రాష్ట్రాల వారీగా భూసార పరీక్షా ప్రయోగశాలల్లో పరీక్షించిన నమూనాల ద్వారా లబ్ధి పొందిన రైతుల సంఖ్య, మరిన్ని మొబైల్ సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీలను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల వారీగా వచ్చిన ప్రతిపాదనల ప్రస్తుత స్థితిపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్ సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయం , రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ మంగళవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
దేశంలోని రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్లను (ఎస్హెచ్సి) జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకాన్ని అమలు చేస్తోందని, మొదటి వార్షిక 2015-16 నుండి 2016-17, రెండవ వార్షిక 2017-18 నుండి 2018-19 వరకు మట్టి నమూనా పరీక్షలు గ్రిడ్ ప్రాతిపదికన జరిగాయని, నీటిపారుదల ప్రాంతాల్లో 2.5 హెక్టార్లను గ్రిడ్ గా, వర్షాధార ప్రాంతంలో 10 హెక్టార్లను గ్రిడ్ ప్రామాణికంగా తీసుకుంటారని కేంద్రమంత్రి బదులిచ్చారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 5 రాష్ట్రాలకు కొత్తగా 25 మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాలలు మంజూరయ్యాయని, బీహార్ కు 10, మధ్యప్రదేశ్ కు 9, మహారాష్ట్రకు 2, తెలంగాణకు 2, త్రిపురకు 2 మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి రామ్నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News