-“క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” అని పేరు పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త వృక్ష జాతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు. అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు కలిగిన ఈ మొక్క ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకున్నాయి. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) పి.వి. చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతి మొక్కను గుర్తించారు. శాస్త్రీయ పరిశీలనల్లో, సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus) తో పోలిస్తే ఈ మొక్క ప్రత్యేకమైన నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను ప్రతిబింబించడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనల ఆవశ్యకతను చాటింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణలు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపద సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
Prajavartha Online Telugu News