గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలి (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లకు అవసరమైన భూముల కేటాయింపుకు పరిశ్రమలు, ఏపిఐఐసి శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు రాష్ట్రస్థాయిలో ఎంఓయులు జరిగిన సంస్థలు వెంటనే కార్యకాలపాలు ప్రారంభించేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆర్ఎఎంపీ శిక్షణ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఓన్ ఫ్యామిలీ ఓన్ ఎంటర్పెన్యూర్ కార్యక్రమం లో అర్హత గల లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయించాలన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ గత నెల రోజుల కాలంలో 970 దరఖాస్తులు అందగా 734 దరఖాస్తులకు మంజూరు చేయడం జరిగిందని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో వివిధ పరిశ్రమల ప్రోత్సాహాలకు సంబంధించి 9 క్లైయిములకు రూ. 91,30,672 మంజూరు చేస్తూ కమిటీలో ఆమోదించారు.
ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం, జిల్లా వ్యవసాయ శాఖ జెడీఏ పద్మావతి, డీటీసీ సితారామయ్య, జిల్లా ఉపాధి అధికారి దుర్గా బాయి పర్యాటక శాఖ అధికారి రమ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్, భూగర్భ జల వనరల శాఖ ఉపసంచాలకులు వందనం, నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, సిక్కీ రిజనల్ హెడ్ పరిమణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News