-స్వర్ణ కవచాలంకృతే నమోనమః
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అష్టభుజాలతో సింహాసనంపై త్రిశూలధారిjైు కనకపు ధగధగలతో మెరుస్తున్న జగన్మాతను దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. నవరాత్రులు ప్రారంభమైన తొలి రోజు నుండి భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు తదితరులు స్వర్ణకవచాలంకృత అవతారములో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
అనంతరం రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి పై 9 రోజులుపాటు జరిగే దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. క్యూ లైన్లు, అన్నప్రసాదాలు పంపిణీ, కేశఖండనశాల, జల్లు స్నానాలు, శానిటేషన్ తదితర విషయాల్లో ఆయా శాఖల సహకారంతో, సమన్వయంతో చేశామన్నారు. ఈనెల 12న మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. కరోనా నిబంధనల నడుమ అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు ఆయన సూచించారు. 5 క్యూ లైన్ల ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేక కుంకుమార్చనలతో పాటు పరోక్ష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత దసరాలో కొండచరియలు విరిగి పడ్డాయని అటువంటి సంఘటనలకు తావు లేకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి రూ. 75 కోట్లు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి కేటాయించారన్నారు. రాబోయే రోజులలో తిరుమల తర్వాత రెండవ దేవాలయంగా దుర్గ గుడి ఉండేలా అభివృద్ది చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగరమేయరు రాయన భాగ్యలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి డా.జి.వాణీమోహన్ భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేశామన్నారు.
Prajavartha Online Telugu News