గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో P4 పథకంలో భాగంగా HCL ఫౌండేషన్ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కుట్టు మిషన్లు మరియు స్కిల్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ శిక్షణ మరియు కుట్టు మిషన్ల పంపిణీ ఎంతో దోహదపడుతుందన్నారు. సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన HCL ఫౌండేషన్ , వాసవ్య మహిళా మండలి సంస్థలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో HCL CSR నిధులను గన్నవరానికి కాకుండా ఇతర నియోజకవర్గాలకు మళ్లించారని ఆరోపించారు. స్థానిక నిధులను ఇక్కడి అభివృద్ధికి వాడుకోవడంలో అప్పటి ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని మండిపడ్డారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా దర్బార్ అనంతరం అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యే పర్యటనల్లో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న సాంకేతిక మరియు ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయం వరకే పరిమితం కావాలని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News