– ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే ఏ విషయాన్ని సహించేది లేదు
– క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– ఫుడ్ ఔట్లెట్లు, ఔషధ దుకాణాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా కల్తీ పాల విషాద సంఘటన కలవరపాటుకు గురిచేస్తున్న వేళ ఇటువంటి దుర్ఘటనలు జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఆర్డీవోలు, తహసీల్దార్ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో ప్రజారోగ్య రక్షణను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఆర్డీవోలు, ఆహార భద్రతాధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.
జిల్లాలోని మిల్క్ అవుట్లైట్లు, పాల సేకరణ కేంద్రాలలో సమగ్ర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పాల నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు పంపించి నాణ్యత ప్రమాణాలను పరీక్షించాలన్నారు. కల్తీ లేదా నాణ్యత లేమి నిర్ధారణ అయిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా, జిల్లాలోని అన్ని ఫుడ్ అవుట్లెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, బేకరీలు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రత, గడువు తేదీలు, నిల్వ విధానం మరియు నాణ్యత ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ విధమైన అక్రమ చర్యలపైనా జీరో టాలరెన్స్ విధానం అమలు చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిషేధిత (Banned) మరియు గడువు ముగిసిన ఔషధాల విక్రయం, నిల్వపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలు గుర్తించినట్లయితే సంబంధిత ఔషధాలను స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద పాలు, ఆహార పదార్థాలు లేదా ఔషధాల గురించి సమాచారం ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News