– రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థల మార్గదర్శకాల ప్రకారం రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నెల 29న జి.కొండూరు మండలం, కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్నినల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు.
జేసీ ఎస్.ఇలక్కియ శుక్రవారం రెవెన్యూ, అగ్నిమాపక, కర్మాగారాలు, పరిశ్రమలు, విద్యుత్, కాలుష్య నియంత్రణ, ఆర్ అండ్బీ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం తదితర సమన్వయ శాఖల అధికారులతో మాక్డ్రిల్ సన్నద్ధతా సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రసాయన ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ స్పందన, సమన్వయం, ప్రజల రక్షణ చర్యలు అత్యంత కీలకమని తెలిపారు. మాక్ డ్రిల్ ద్వారా విపత్తు సమయంలో చేపట్టాల్సిన చర్యలను ప్రాక్టికల్గా అమలు చేసి, లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం సాధ్యమవుతుందన్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తమ తమ బాధ్యతలను స్పష్టంగా తెలుసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. సంఘటన స్థలంలో రక్షణ చర్యలు, బాధితుల తరలింపు, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, విద్యుత్ సరఫరా నియంత్రణ వంటి అంశాలను సమగ్రంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, విపత్తు నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి సన్నద్ధతతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆదేశించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎంవీ శివకుమార్, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News