-ముఖ్య అతిథిగా హాజరైన గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు
-సమాజ ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమని, ఆరోగ్య వ్యవస్థకు నర్సులు వెన్నెముకలాంటివారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లిలో డాక్టర్ సి.శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రిన్సిపల్స్ & చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్’ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TNAI) ఆంధ్రప్రదేశ్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ & మిడ్వైవ్స్ కౌన్సిల్ (APNMC) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింగ్ వృత్తిని బలోపేతం చేసేందుకు సమూల మార్పులు అవసరమన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రూ. 20 వేల కనీస వేతనం సరిపోదని, దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఏకరీతి కనీస వేతన విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ‘స్టాఫ్ నర్స్’ హోదాను ‘నర్సింగ్ ఆఫీసర్’గా మార్చడం, రాష్ట్రంలో నర్సింగ్ కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో TNAI సొంత భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విదేశీ నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశానికి TNAI జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అనీ కుమార్ అధ్యక్షత వహించగా, APNMC రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సుశీల గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అలాగే డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. జ్యోతి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జి. రఘునందన్, TNAI జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బజ్జి వల్లి, సెక్రటరీ జనరల్ ఎవిలిన్ పి. కన్నన్, రాష్ట్ర అధ్యక్షురాలు డి. ఉషా పన్నగవేణి, సెక్రటరీ కె.వి. శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News