– జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు
– యువ ఆవిష్కర్తల మేధో ప్రదర్శనకు సరైన వేదిక
– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) సందర్భంగా విజయవాడ, ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)లో స్టార్టప్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్లకు ప్రోత్సాహం అందించేందుకు ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడ జోన్ పరిధిలోని అన్ని స్టార్టప్లు ఈ ఎక్స్పోలో పాల్గొనవచ్చని తెలిపారు. స్టార్టప్లకు ప్రత్యేక స్టాళ్లతో వారి ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నమూనాలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇన్నోవేషన్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉత్తమ స్టార్టప్లకు నగదు బహుమతులు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి బహుమతి – రూ. 30,000, ద్వితీయ బహుమతి – రూ. 20,000, మూడో బహుమతి – రూ. 15,000 ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో ప్రతిభ కనబరుస్తున్న యువత, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమం పూర్తి వివరాల కోసం: 9154970454 లో సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News