-ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం లేదు
-ప్రజలకు ఆధునిక, పర్యావరణ హిత రవాణా సేవలందించడమే లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTCలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడం ద్వారా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొన్ని వర్గాల్లో వస్తున్న వార్తలు వాస్తవాలకు విరుద్ధమని APSRTC స్పష్టం చేసింది. ప్రజలు మరియు ఉద్యోగులు అపోహలకు గురికాకుండా వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ ఈ ప్రకటన విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరిశుభ్రమైన, పర్యావరణ హిత మరియు సుస్థిర పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు “PM eBus Sewa Scheme”ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద దేశంలోని పలు నగరాల్లో సుమారు 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ఈ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు “గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)” విధానంలో నడపబడతాయని, ఇది కొత్త విధానం కాదని APSRTC వివరించింది. ఇప్పటికే 2021లో కేంద్ర ప్రభుత్వ FAME-II పథకం కింద 100 ఎలక్ట్రిక్ బస్సులు APSRTCలో GCC విధానంలో ప్రవేశపెట్టబడి ప్రస్తుతం తిరుపతి–తిరుమల, తిరుపతి–నెల్లూరు, తిరుపతి–కడప తదితర మార్గాల్లో విజయవంతంగా నడుస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం PM eBus Sewa పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించబడినట్లు తెలిపారు. అదనంగా, తిరుపతి–తిరుమలను గ్రీన్ కారిడార్గా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా APSRTCకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. సివిల్ మౌలిక వసతుల వ్యయంలో 60 శాతం, ఎలక్ట్రికల్ మౌలిక వసతుల వ్యయంలో 100 శాతం గ్రాంట్ అందించబడుతోందని తెలిపారు. 750 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరియు ఛార్జింగ్ సదుపాయాల కోసం రూ.145.39 కోట్ల గ్రాంట్ మంజూరైనట్లు వెల్లడించారు.
అదేవిధంగా, ప్రతి 12 మీటర్ల బస్సుకు కిలోమీటరుకు రూ.24, ప్రతి 9 మీటర్ల బస్సుకు కిలోమీటరుకు రూ.22 చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనున్నందున APSRTCకు సుమారు రూ.1774 కోట్ల వరకు ప్రయోజనం కలగనున్నట్లు పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు రవాణా సేవల సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, ఛార్జింగ్ వ్యవస్థలు, బ్యాటరీ నిర్వహణ వంటి అంశాలకు భారీ మూలధన వ్యయం అవసరమవుతుందని, ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలో ఉన్నందున దేశంలోని పలు రాష్ట్ర రవాణా సంస్థలు GCC విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో బస్సుల నిర్వహణ బాధ్యత ఆపరేటర్దైనా, మార్గాలు, చార్జీలు మరియు ప్రజా సేవల నియంత్రణ పూర్తిగా APSRTC ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని APSRTC స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం లేదా GCC విధానం కారణంగా ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. అవసరమైతే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు భవిష్యత్తులో డ్రై లీజ్ విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజలకు సురక్షితమైన, అందుబాటులో ఉండే, సమర్థవంతమైన మరియు పర్యావరణ హిత రవాణా సేవలను అందించడంతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు APSRTC ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News