విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ మరియు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్ ఈరోజు విజయవంతంగా పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మొత్తం 7392 మంది విద్యార్థులు విజయవాడలో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాశారు. దర్శగః స్కూల్, మోడరన్ పబ్లిక్ స్కూల్ మరియు అల్ కరీం స్కూల్స్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
మైనారిటీ & న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఆదేశాల మేరకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అభ్యర్థనతో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ ఈరోజు పరీక్షా కేంద్రాలను సందర్శించి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ మరియు వక్ఫ్ జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల మంది విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడం సంతోషకరమని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఇటువంటి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News