న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తమిళనాడు జౌళి శాఖ మంత్రి తీరు ఎం. విజయ్ బాలాజీని, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి సంపత్ కీర్తన ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జౌళి, హస్తకళలు, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సంప్రదాయ కళాకారులకు మార్కెట్ అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని కలంకారీ, కొండపల్లి, ఏటికొప్పాక వంటి విశిష్ట హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరాన్ని డా. హరిప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే హస్తకళలు, జౌళి రంగాల్లో రాష్ట్రాల మధ్య అనుభవాల మార్పిడి, కళాకారులకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు ఇలాంటి జాతీయ స్థాయి వేదికలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. భారత్ టెక్స్–2026 వంటి ప్రతిష్ఠాత్మక ఎక్స్పోలు దేశంలోని జౌళి, హస్తకళా రంగాలకు కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతీయ కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే వేదికలుగా నిలుస్తున్నాయని డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
Prajavartha Online Telugu News