గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుద్యం అందించడం ద్వారా స్వచ్చ గుంటూరు సాధనకు ప్రజారోగ్య విభాగ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, పారిశుద్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ లోని డి.ఆర్.సి. సమావేశ మందిరంలో సచివాలయాల అడ్మిన్, ఏ.ఎన్.ఎం., శానిటేషన్ కార్యదర్శులతో జూమ్ ద్వారా, నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులతో నేరుగా కమిషనర్ నగరంలో పారిశుధ్యం, సీజనల్ వ్యాధులు, ట్రేడ్ లైసెన్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇక నుండి పారిశుధ్య నిర్వహణను సచివాలయాల వారిగా అడ్మిన్, ఏ.ఎన్.ఎం., శానిటేషన్ కార్యదర్శులు సంయుక్తంగా పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాలని, ప్రతి రోజు పర్యటన వివరాలు పంపాలని ఆదేశించారు. సంయుక్త పర్యటనలో కార్యదర్శులు పారిశుద్యంతో పాటుగా సీజనల్ వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్గించాలని, నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలియచేయాలన్నారు. సదరు కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని తెలిపారు. యాంటి మలేరియా ఆపరేషన్స్ జరిగినప్పుడు సచివాలయం పరిధిలో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ పైప్ కు నైలాన్ నెట్ లు కట్టాలని, నీరు నిలిచే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, గంబుషియా చేపలు విడవడం చేయాలన్నారు. యుద్దప్రాతిపదికన రానున్న వారం రోజుల్లో ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వడం, మెరక చేయించడం, ఆయిల్ బాల్స్ వేయడం, నోటీసు బోర్డ్ లు ఏర్పాటు పూర్తీ చేయలన్నారు. ఆయిల్ బాల్స్ ను ప్రతి మలేరియా డివిజన్ కార్యాలయంలో సిద్దం చేయాలన్నారు. నగరంలో జీరో డెంగ్యూ లక్ష్యంగా పని చేయాలన్నారు. అలాగే ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా రోడ్ల మీద చెత్త వేస్తె అపరాధ రుసుం విధించాలని, షాప్స్ వారు వేస్తె సీజ్ చేయాలని స్పష్టం చేశారు. ట్రాక్ మై ట్రిప్ యాంప్ ని ప్రతి శానిటేషన్ కార్యదర్శి డౌన్ లోడ్ చేసుకొని, ప్రతి రోజు ఒక పుష్ కాట్ వెంబడి వెళ్లి ప్రజలకు ఇంటి వద్దకు చెత్త సేకరణకు ఏ సమయంలో వచ్చేది తెలియ చేయాలన్నారు. మధ్యాహ్న సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో సమగ్ర పారిశుధ్య పనులు, డ్రైన్ల శుభ్రం చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లు లేని వ్యాపార వాణిజ్య సంస్థలను సీజ్ చేయాలన్నారు. కార్మికుల హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, సెలవులు పెట్టేందుకు ముందస్తు వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలన్నారు. చెత్త తరలింపుకు డివిజన్ల వారీగా వాహనాలను కూడా క్రమ పద్దతిలో వెహికిల్ షెడ్ నుండి పంపాలని డి.ఈ.ఈ.ని ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ. బయాలజిస్ట్ మధుసూదన్ రావు, యస్.యస్.లు రాంబాబు, ఆనందకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, జూమ్ ద్వారా సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News