– ఇద్దరికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం
– కలెక్టర్ ఎస్.డిల్లీరావు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లబ్ధిదారుల ధన్యవాదాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్, రివర్ వ్యూ పార్కు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు కల్పించే పత్రాలను అందించి కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పనిసరిగా అండగా ఉంటానని అధైర్యపడొద్దంటూ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలను తీర్చే నిమిత్తం మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి.. తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్య సేవల కోసం ఒకరు, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు మరొకరు తమకు సహాయం చేయాలని అడిగిన వెంటనే భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పుకున్న వెంటనే అర్థం చేసుకొని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
లబ్ధిదారుల వివరాలు:
1. విస్సన్నపేట మండలం, నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు భానుతేజ కేన్సర్తో బాధపడుతున్నాడని.. చికిత్స అవసరాల నిమిత్తం సాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు.
2. విజయవాడ, అజిత్సింగ్ నగర్కు చెందిన 31 ఏళ్ల కంబా ఏడుకొండలు ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు.
Prajavartha Online Telugu News