Breaking News

ప్రజలు, అధికారుల సహకారంతో సమర్థవంతంగా విపత్తును ఎదుర్కొన్నాం

-ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటాం
-ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన గత పాలకులు
-గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు ఇబ్బందులు పడ్డ 6.5 లక్షల మంది ప్రజలు
-అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
-రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల సంగతి తేలుస్తాం
-బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి
-10 రోజులు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని సచివాలయంగా మార్చుకొని పని చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-ప్రతి ఒక్క వరద ముంపు బాధితుడిని ఆదుకుంటామని వెల్లడి
-మూడు గండ్లు పూడ్చిన తీరును సీఎంకు వివరించిన అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు, అధికారుల సహకారంతో 10 రోజుల్లో భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పదో రోజు పర్యటించిన ఆయన బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని, అంతిమంగా ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ పడని వర్షాలు పడ్డాయని, ప్రకృతి కన్నెరజేసిందన్నారు. కృష్ణానదిలో రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడం, డ్రెయిన్లు పొంగడం, అదే సమయంలో బుడమేరుకు పెద్ద ఎత్తున నీరు రావడం.. ఇలా అన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయన్నారు. మూడు రోజుల పాటు ఏం చేయాలో.. ఎలా చేయాలో అర్థం కాలేదు. గత పాలకులు ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారన్నారు. భ్రష్టు పట్టించారన్నారు. గత ఐదేళ్లుగా బుడమేరు ఆక్రమణలకు గురైందని, అక్రమ కట్టడాలు కట్టారని, అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసుకున్నారన్నారు. ఒకానొక దశలో బుడమేరు పూడుకుపోయే దశకు చేరిందన్నారు. ఐదేళ్లలో చెత్తాచెదారం తీయకపోవడం వల్ల అవి పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారాయన్నారు. గత ప్రభుత్వం బుడమేరు గట్లను పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 6 లక్షల మంది ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయన్నారు. దుర్మార్గ పాలన వల్ల లక్షలాది మంది కష్టపడే పరిస్థితి వచ్చిందన్నారు. బుడమేరును కట్టడి చేయకపోవడం వల్ల విజయవాడలో పరిస్థితి ఎలా ఉందో అందరూ చూశారన్నారు. గండ్లు పడకుండా ఉండి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదన్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ అధికారులు రేయింబవళ్లు కష్టపడి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చారని పేర్కొన్నారు. ఇప్పటికి కొంత లీకేజీలు ఉన్నాయని, కట్టను బలోపేతం చేస్తున్నామన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో నారాలోకేష్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించారన్నారు. డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పూడ్చివేత పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని తెలిపారు. అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమించిందన్నారు. ప్రజలు సైతం సహకరించారన్నారు.

ప్రతి ఒక్క ఇంటికీ ఆహార పొట్లాలు పంపించాలని ప్రయత్నించామన్నారు. ఒకరోజు 10 లక్షల ఆహార పొట్లాలు పంపించామన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో బాధిత ప్రజలకు ఆహారం, తాగునీరు అందించాం. ఎంత ప్రయత్నించినా చివరన ఉండే ప్రజలకు సరిగా సాయం అందించలేకపోయామన్నారు.

వరద బాధితులకు సాయం చేసేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నారన్నారు. కొందరు ఆర్థిక సాయం చేస్తుంటే.. మరికొందరు ఆహారం, వస్త్రాలు సాయం చేస్తున్నారని తెలిపారు. అందరూ సాయం చేస్తుంటే గత పాలకులు మాత్రం విషం చిమ్ముతున్నారని వాపోయారు. ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

ఏ మాత్రం సిగ్గులేకుండా కృష్ణా నదిలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు లెక్కలేనితనంతో 3 బోట్లు వదిలిపెట్టి 170 ఏళ్ల చరిత్ర గల ప్రకాశం బ్యారేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఆ బోట్లు 15 మెట్రిక్ టన్నులు ఉండే కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడం వల్ల రెండుగా విడిపోయాయన్నారు. అవే బోట్లు కౌంటర్ వెయిట్ కు కాకుండా కాలమ్ ను ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని వివరించారు. బోట్లను సరిగా ఉంచుకోకపోతే ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. బోట్లు విపక్షానివి కావనుకుంటే సంబంధిత రంగులు ఎందుకు వేశారన్నారు. బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను జాతిద్రోహం, విద్వేషంగా భావిస్తున్నామన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

వరద ప్రాంతాల్లో 10 రోజులు మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, పారిశుధ్ధ్య సిబ్బంది కష్టపడి పనిచేశారన్నారు. అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం చేసిన త్యాగాలు చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ సాయంతో వరద సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టామన్నారు.
టెలీకాన్ఫరెన్స్ లు పెట్టి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్ష చేసి ప్రాణ నష్టం, పంట నష్టం బాగా తగ్గించగలిగాం కానీ ఆస్తినష్టం తగ్గించలేకపోయామన్నారు. ఇళ్లలోని గృహోపకరణాలన్నీ నీట మునిగిన పరిస్థితి. ప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఫైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేస్తున్నామన్నారు.

ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీమ్ ను పంపించామన్నారు. యాప్ ద్వారా డేటా సేకరించామన్నారు. లక్ష కుటుంబాల డేటాను అప్ డేట్ చేశామన్నారు. విజయవాడలోనే కాదు లంక ప్రాంతాల్లో గ్రామాలు సైతం దెబ్బతిన్నాయి. కొల్లేరు ప్రాంతం దెబ్బతింది. ఏలేరు దిగువ ప్రాంతం దెబ్బతింది. విశాఖపట్నంలో కొండచరియల వల్ల కొంత ప్రాంతం దెబ్బతిన్నది.. వాటన్నింటినీ అధ్యయనం చేస్తున్నామన్నారు.

వాహనాల స్పేర్ పార్ట్స్ కు కూడా 100 శాతం సబ్సిడీ ఇచ్చేలా కంపెనీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రజలు కోలుకొని ధైర్యంగా ముందుకు వెళ్లే వరకు అండగా ఉంటామన్నారు. బుధవారం నుండి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఏలేరు బాధితులు, విశాఖ బాధితులను పరామర్శిస్తానన్నారు. అనంతరం నందివాడ, కొల్లేరు, బాపట్ల లంక బాధితులను, వేమూరు బాధితులను పరామర్శిస్తానన్నారు.

సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదనే నియమాలుంటాయి కానీ మేం రాత్రింబవళ్లు కష్టించి పనిచేశామన్నారు. వరద సహాయక చర్యల్లో రాత్రింబవళ్లు పనిచేసి ఎందరికో స్ఫూర్తి నింపిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. సమాజం కోసం చూపిన చొరవగా అభివర్ణించారు. మీడియా ప్రతినిధులు సైతం ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరవేయడంలో బాగా పనిచేశారని అభినందించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల కృషిని కొనియాడారు. పాఠశాల విద్యార్థులు కిడ్డీ బ్యాంకుల్లో నుండి డబ్బు తీసుకొచ్చి వరద బాధితులకు అందించమని సాయం చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు. రాజకీయ ముసుగులో మాట్లాడుతున్న నేరస్థుల ముసుగు తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. నేరస్థుల్ని ప్రజలముందు నిలబెడతామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *