గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై సంచరించే ఆవులు, ఎద్దులు, గేదెలను సంబందిత యజమానులు వారి స్వంత ఆవరణలోనే పెంచుకోవాలని, అలా కాకుండా రోడ్లమీదకు వదిలితే వాటిని జిఎంసి ప్రజారోగ్య సిబ్బంది బంధించి గోశాలకు తరలిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో విచ్చలవిడిగా రోడ్ల మీదకు ఆవులను, ఇతర పశువులను వదిలి వాహనాల రాకపోకలకు ఆటంకంగా, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నారన్నారు. రోడ్ల మీదకు వచ్చే పశువులను ప్రజారోగ్య సిబ్బంది బంధించి వెంగళాయపాలెంలోని జిఎంసి గోశాలకు తరలించడం జరుగుతుందన్నారు. తదుపరి సదరు పశువులను సంబందిత యజమానులకు ఇవ్వాలి అంటే ఆ పశువులు వారివే అని తగిన ఆధారాలతో రుజువు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గోశాలలోని పశువులను యజమానులకు ఇచ్చేందుకు ఒక్కో పశువుకి తొలుత రూ.1000 అపరాధ రుసుం, అలాగే గోశాలకు తరలించిన నాటి నుండి రోజుకి రూ.300 చెల్లించాలని, అది కూడా గోశాలకు తరలించిన 10 రోజులలోపు మాత్రమే అమలులో ఉంటుందన్నారు. యజమానులు తీసుకెళ్లని వాటిని ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థ చట్టం 1955 సెక్షన్ 510 ప్రకారం గోశాలకు తరలించిన 10 రోజుల గడువులోపు యజమానులు స్పందించకుంటే యజమానులు ఎవ్వరూ లేరని భావించి, వాటిని వేలం నిర్వహిస్తామన్నారు. వేలం ద్వారా వచ్చిన నగదుని జిఎంసి ఖజానాకు జమ చేస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News