– హస్తకళా ఉత్పత్తులను నేటి తరం ఆదరిస్తుండటం అభనందనీయం
– మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ
– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి.రేఖారాణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హస్తకళాభిమానులకు నాణ్యమైన కళాత్మక ఉత్పత్తులను అందించడంతో పాటు కళాకారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి.రేఖారాణి తెలిపారు.
కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రాయోజికత్వంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న లేపాక్షి గాంధీ శిల్ప్ బజార్ను
బుధవారం కమిషనర్ రేఖారాణి సందర్శించి, హస్తకళా ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులతో ఆమె ముచ్చటించి, వారు రూపొందించిన ఉత్పత్తుల తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశం ప్రాచీన హస్తకళలు, ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అనేకమంది హస్తకళాకారులు వారి కళా నైపుణ్యంతో రూపొందించిన కళాత్మక ఉత్పత్తులను నేటితరం ఆదరించడం అభినందనీయమన్నారు. నరసాపురం లేస్ అల్లికలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ లభించడం ఆనందం కలిగిస్తుందని మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు జీవంపోసి వాటిని భావితరాలకు అందించాలంటే హస్తకళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. మన రాష్ట్రానికి చెందిన కళా ఉత్పత్తులతో పాటు పలు రాష్ట్రాల్లో తయారైన అనేక కళారూపాలను ఒకేవేదికపైకి తీసుకొచ్చి వినియోగదారులకు అందించేలా ప్రదర్శన, అమ్మకాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనలను ఎంతగానో ఆదరిస్తున్నారని, అదేవిధంగా లేపాక్షి హస్తకళా ప్రదర్శనను కూడా ఆదరించి కళాకారులకు మరింత జీవనోపాధి కల్పించేందుకు వినియోగదారులు ముందుకురావాలని ఆమె కోరారు.
ఇప్పటివరకు రూ. 40 లక్షల అమ్మకాలు: ఏపీ హెచ్డీసీ లిమిటెడ్ ఎండీ ఎం.విశ్వ
ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ హెచ్డీసీ) లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం.విశ్వ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన లేపాక్షి గాంధీ శిల్ప బజార్ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. ఇప్పటివరకు రూ. 40 లక్షల అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని.. ఈ ప్రదర్శనలో టెక్స్టైల్స్, ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, ఉడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, బాటిక్ ప్రింట్స్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీ అపర్ణ లక్ష్మి, లేపాక్షి మేనేజర్ మహంకాళి సురేష్, హెచ్పీఓ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News