ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో వృద్ధి కేంద్రాల ప్రోగ్రామ్ (గ్రోత్ హబ్స్) కింద అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల ఎంపికలో ఆంధ్రప్రదేశ్కు చోటు కల్పించబడిందా? ఈ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేస్తే ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏవైనా రూపొందించబడ్డాయా? అంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రణాళికా మంత్రిత్వ శాఖ ను ప్రశ్నించటం జరిగింది.
ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హదా), కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ హోదా) శాఖల సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ బదులిస్తూ ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా నగరాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా నీతి ఆయోగ్ (NITI Aayog) రూపొందించిన గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం (Visakhapatnam Economic Region)గా ఎంపిక అయినట్లు తెలిపారు.. ఇందులో అనకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేశారని చెప్పారు.
నీతి ఆయోగ్ రూపొందించిన అంచనా ప్రకారం, ఈ ప్రణాళిక అమలు ద్వారా విశాఖపట్నం ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఆర్థిక , పెట్టుబడి ప్రణాళిక రూపొందించడం, జీవన నాణ్యత పెంపొందించడం, సమానత్వం , స్థిరత్వానికి ప్రత్యేక ప్రణాళికల అమలు వంటి మూడు కీలక అంశాల చుట్టూ రూపకల్పన చేయబడిందని తెలిపారు. ఈ ప్రాంతం ఎంపికకు చేసిన అధ్యయన ఫలితాలు పెట్టుబడి నిర్ణయాల్లో ఉపయోగిస్తారన్నారు.
Prajavartha Online Telugu News