-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘దివ్యాంగుల హక్కుల చట్టం, దివ్యాంగుల కోసం ఇతర పథకాల అమలులో ఉత్తమ రాష్ట్రం’గా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షాకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అందుకున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ & దివ్యాంగ సాధికారత విభాగం (దివ్యాంగ జన్) ఆధ్వర్యంలో జరిగిన ‘నేషనల్ అవార్డ్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 2024’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ అవార్డును సాధించింది. ఈ కీర్తిని సాధించడంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా దిశానిర్దేశంలో సహిత విద్యా విభాగం ప్రముఖ పాత్ర పోషించింది.
ఉన్నతాధికారుల ప్రశంసలు
ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ IAS, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. వి. IAS., సమగ్రశిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS కి, సహిత విద్యావిభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అవార్డు అందుకున్న సందర్భంగా సహిత విద్యా విభాగం సమగ్ర శిక్షా సిబ్బందికి స్వీట్లు పంచారు.
అవార్డు వెనుక ఎంతో కృషి…
• ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా దివ్యాంగులకు సరైన విద్యా అవకాశాలు అందించడంలో ముందంజలో ఉంది. ఇందులో భాగంగా దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానం, ఇంటర్నెట్ ఆధారిత టూల్స్ ద్వారా సమానమైన విద్యా అవకాశాలను అందించడం ద్వారా గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు పొందింది.
• ఇన్ క్లూజీవ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఉత్సవాలు విజయవంతమయ్యాయి. ఈ కార్యక్రమాలు, దివ్యాంగుల సామాజిక హక్కుల పట్ల అవగాహన పెంచడం, వారి సాధికారతను పెంపొందించడం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాయి.
Prajavartha Online Telugu News