విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి రైతులను హౌజ్ అరెస్ట్ చేయడంపై వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. వందలాది మంది పోలీసులు గ్రామాన్ని మోహరించడంపై నిప్పులు చెరిగారు. పచ్చని పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులను ఈ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తూ.. హౌజ్ అరెస్ట్ లు చేయడం దుర్మార్గమన్నారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడ భూసేకరణలో నష్టపరిహారం అందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకానీ పంటలు పండించే రైతుపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో గత తెలుగుదేశం హయాంలోనే ఏపీఐఐసీకి ఇక్కడి రైతులు భూములు అప్పగించారని గుర్తుచేశారు. కానీ పరిహారం అందించకుండా రైతులను కూటమి సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా రైతులకు కులాలు, పార్టీలను ఆపాదిస్తూ.. పరిహారం చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ ప్రాంత రైతులకు న్యాయం చేస్తానని మల్లవల్లి పర్యటన సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. న్యాయం చేయడమంటే బలవంతంగా భూములు లాక్కోవడమేనా..? సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే మల్లవల్లి రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని.. లేకుంటే రైతుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News