-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైన్స్ కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలతోసహా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు గత 4 సంవత్సరాలుగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీల్కు రూ.11,500లు ప్యాకేజీ ఇస్తామని, అందులో రూ.10,300 కోట్లు బాండ్ల రిడిరప్షన్ క్రింద ఇస్తామని ప్రకటించింది. ఇదే వాస్తవమైతే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నేతలు భావించడం లేదు. కాని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే క్యాపిటివ్ మైన్స్ కేటాయించి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17 వేల కోట్లు అప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం, కేవలం రూ.11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటివ్ మైన్స్ కేటాయించకుండా, అనకాపల్లిలో దాదాపు రూ.70 వేల కోట్లతో మిట్టల్ ఏర్పాటుచేసే ప్రైవేటు పరిశ్రమకు క్యాపిటివ్ మైన్స్ కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాపిటివ్ మైన్స్ కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.
Prajavartha Online Telugu News