గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను భాధ్యతగా అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 21 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, ఆయా ఆర్జీలను ర్యాండమ్ గా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిఎంసి కార్యాలయానికి వస్తున్నారని, అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. ప్రజల నుండి అందే అర్జీలు, ఫిర్యాదుల నమోదుకి ప్రతి విభాగంలో ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 41 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 15, ఇంజినీరింగ్ విభాగం 9, రెవెన్యూ విభాగం 10, ప్రజారోగ్య విభాగం 5, ఉపా సెల్ విభాగానికి సంబందించి 2 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, డిసిపి సూరజ్, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఉపా సెల్ పిఓ రామారావు, మేనేజర్ బాలాజీ బాష తదితరులు పాల్గొన్నారు.
