మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో జరగబోయే మసులా బీచ్ ఫెస్టివల్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి బీచ్ ఫెస్టివల్ కు చేయవలసిన ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రేఖా చిత్రపటాన్ని పరిశీలించి ప్రదర్శనశాలలు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్, బీచ్ కబాడీ, పడవ పందాలు వంటి క్రీడల నిర్వహణ, పారిశుద్ధ్యం, జనసమూహ నిర్వహణ, తాగునీటి ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసేవిధంగా మసుల బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానంగా కార్యక్రమాలన్నీ సాయంత్రం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం జరిగే ప్రాంతంతో పాటు రహదారుల వెంబడి విద్యుత్ దీపాలు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సముద్రంలో నిర్దేశిత దూరం వరకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్సవాలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమృద్ధిగా తాగునీటిని ఏర్పాటు చేయడంతో పాటు, పెద్ద మొత్తంలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్యం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మసుల బీచ్ ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు, ఇతర ప్రముఖులకు కావలసిన వసతి సదుపాయాలు, అతిథి గృహాల ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫరీన్ జైద్, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, బందరు డిఎస్పి చప్పిడి రాజా, బందరు ఆర్డిఓ కే స్వాతి, మెప్మా పీడీ సాయిబాబు, తహసిల్దార్ హరినాథ్, ఈవెంట్ ఆర్గనైజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News