-అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దు
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“తల్లికి వందనం” పథకానికి నమోదు చేసుకొని, ఖాతా లలో నగదు జమ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ గ్రామ, వార్డు సచివాలయంలో అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఆమేరకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ జేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో “తల్లికి వందనం” పథకం పై డివిజనల్ అభివృద్ధి అధికారి (డి ఎల్ డి వో) పి. వీణా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి కె . వాసుదేవ రావు, సాంకేతిక సిబ్బంది నాగేశ్వర రావు లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ…. తల్లికి వందనం కింద జిల్లాలో ఇప్పటివరకు అందిన ఫిర్యాదులలో 9,361 పరిష్కరించామన్నారు. వీటిలో 2,865 మందికి ఇప్పటికే చెల్లింపులు చేశామని, మరో 6,496 మందికి త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని తెలియజేశారు. 6,431 ఫిర్యాదులు నవశకం పోర్టల్ మార్గదర్శకాలను అనుసరించి పరిశీలన దశలో ఉన్నాయని చెప్పారు. సరైన ఆధార్ నంబర్ ఇవ్వక పోవడం, తల్లికి, బిడ్డకి ఒకే ఆధార్ ఉండడం, ఆధార్ నెంబర్ ఇచ్చిన పేరెంట్ మరణించడం, తదితర కారణాల రీత్యా కొంత మందికి చెల్లింపులు జరగలేదని చెప్పారు.
నెలవారి సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించిన వారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నాలుగు చక్రాల వాహనాల యజమానులు, పట్టణాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం కలిగిన వారు, గ్రామాలలో మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాణి (వెట్), పది ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి కలవారు ఈ పథకానికి అనర్హులని తెలియ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పకుండా పథకం వర్తింపు చెయ్యడం జరుగుతుందని వెల్లడించారు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్న గ్రామ, వార్డు సచివాలయంలో నమోదు చేయవచ్చని, వాటికి సంబంధించి సరైన ధృవ పత్రాలను సమర్పించాలని , ప్రభుత్వ వెబ్ పోర్టల్ కూడా సరి చెయ్యడం జరుగుతుందని వెల్లడించారు.
Prajavartha Online Telugu News