-తలిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు! తన మానవతా హృదయాన్ని చాటుకునే నిర్ణయం! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని అద్భుత ఆలోచన! తలిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం కోత విధించి, ఆ నగదును నేరుగా తల్లి ఖాతాలో జమ చేసే ఆలోచన ఆచరణలోకి తీసుకు రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించి ఫిర్యాదులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇటీవల కాలంలో వృద్దాప్యంలో చాలామంది తమ కుమారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అనేకం వెలుగులోకి వచ్చాయి. కొందరు తలిదండ్రులు నేరుగా తమ పిల్లలు పట్టించుకోవడం లేదని ఆయా పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. కొందరేమో తమ పిల్లలకు ఇచ్చిన ఆస్థులు తిరిగి తమకు చెందాలంటూ పోలీస్ స్టేషన్ లు, కోర్టులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆచరణలోకి వస్తే వృద్దాప్యంలో చాలామంది తలిదండ్రులకు భరోసా కల్పించినట్లు అవుతుంది!
ఆమోదయోగ్యమైన అభిందించదగిన నిర్ణయమే! అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే లక్షల కుటుంబాల్లో ఇలా నిర్లక్ష్యానికి గురయ్యే తలిదండ్రులు కేవలం వందల్లోనే ఉంటారు! అసలు ఈ సమస్య ప్రైవేట్ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో అధికంగా ఉంది! అలాగే ఉచిత స్కీములకు అలవాటు పడిన కుటుంబాల్లో ఉంది! అంతెందుకు, ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే వృద్దాప్య పెన్షన్లను కూడా లాక్కునే కుటుంబ సభ్యులు ఉన్నారు! కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలోని పరిస్థితి కాకుండా అందరు తలిదండ్రులకు వర్తించేలా ఏదైనా చట్టం తీసుకు రావచ్చేమో! ఈ దిశగా అలోచించి నిర్ణయం తీసుకుంటే ఇంకా బావుంటుంది!
Prajavartha Online Telugu News