
నూజివీడు, ఆగష్టు, 20 :
ప్రజా సంక్షేమ పాలనను పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తపన అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సంక్షేమ పాలనను తీసుకు వెళ్లామన్నారు. గొల్లపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, యంఎన్ కె రోడ్డు నుండి గ్రామంలోనికి తారు రోడ్డును కూడా త్వరలో వేయడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు తమ సమస్య పరిష్కారం కొరకు సచివాలయానికి వచ్చినప్పుడు సిబ్బంది వారి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీరును నియమించి, వారి పరిథిలోని నిరుపేదలకు సంక్షేమ పధకాలను అందించాల్సిన బాధ్యతను అప్పగించామన్నారు. సచివాలయమంటే సంక్షేమ పథకాల వేదిక అని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని అన్నారు. అధికారులు, గ్రామస్థులు అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. అనంతరం శాసన సభ్యులను గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు గజమాలతో, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు గ్రామంలో 19.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన తృతీయ శ్రేణి గ్రంథాలయ భవనాన్ని శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ డిఇఇ రఘురామ్, ఏఇ సుభాకర్ రావు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ, కౌన్సిలర్ , శీలం రాము, గ్రామ పంచాయితీ సర్పంచ్ బి. వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News