– ఉద్యోగుల సమస్యల పరిష్కారం వైపు ప్రభుత్వం అడుగులు వేయాలి.
– పీఆర్సీ కమిషనర్ నియామకం పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోండి
– ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు, ఏపీ జేఏసీ ఛైర్మన్ ఎ.విద్యాసాగర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు నిర్మాణాత్మక సహకారం అందిస్తున్నారని.. గత ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసిందని, అయితే కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా డీఏ మంజూరు చేయాలని ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు, ఏపీ జేఏసీ ఛైర్మన్ ఎ.విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు.
తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆదివారం తిరుపతి ఎన్జీవో హోమ్లో విద్యాసాగర్ మీడియా సమావేశం నిర్వహించారు .మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఆర్నెల్లకోసారి ఇవ్వాల్సిన డీఏ మంజూరు కావడం లేదని.. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల విషయంలోగానీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలనుగానీ పరిష్కరించాలని వత్తిడి చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదేమో అన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 25 నెలలు గడుస్తున్నా వేతన సవరణ కమిషన్ వేయకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త కమిషనర్ నియామకం చేపట్టాలన్నారు. గత మూడునాలుగేళ్లుగా సంపాదించిన సెలవు మొత్తాలు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటికి త్వరితగతిన ఆర్థిక ఆమోదం తెలపాలని కోరారు. రూ. 30 వేల కోట్ల బకాయిల విషయంలోనూ చర్యలు తీసుకోవాలన్నారు. అందరి వైపూ వెళ్తున్న ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లవైపు వెళ్లడం లేదనే భావన నెలకొందన్నారు. అందువల్ల ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల పీఆర్సీ వైపు, DA వైపు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వైపు, హామీల అమలువైపు వెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫోరంను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సమస్యలతో పాటు ఆర్థికేతర సమస్యలూ పెండింగ్లో ఉన్నాయని.. ఒక్క బకాయిలు, కేసులు, ఒకటో తేదీన జీతాలు విషయంలో తప్పితే మరే సమస్యపైనా దృష్టిపెట్టడం లేదనే బాధ ఉద్యోగుల్లో ఉందన్నారు. రూ. 30 వేల కోట్ల బకాయిలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరికంటే మాకు బాగా తెలుసు.. వీటిని గమనిస్తూనే ముందుకెళ్లున్నాం.. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టాలని కోరుతున్నం.
పి.ఆర్.సి కమిషనర్ పునర్నియామకంలో ఆలస్యం, పి.ఆర్.సి నివేదిక తుదీకరణలో జాప్యం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమన భత్యం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. వీటితోపాటుగా రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి, వారికీ రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో2023లో ప్రభుత్వం జూన్ 2014 లోపునియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపు 3000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మిగిలిన వారిని రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు ఏపీ ఎన్జీవో రాష్ట్ర సంఘం డిమాండ్ మేరకు ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిరహించడం జరిగిందన్నారు పెన్షనర్లకు సంబంధించి 70 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్పై 10%, 75 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 15% అదనపు పెన్షన్ గతంలో ఇవ్వబడేదన్నారు. 11వ పి.ఆర్.సి అమలు తర్వాత రద్దు అయిన ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు.అదే విధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ ఈ సౌకర్యాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటితో పాటుగా ఇతర ప్రధాన సమస్యలైన 1-9-2004 లోపు పోస్టింగ్ పొందిన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు, హెచ్ ఓ డీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటి స్థలాలు, ఏపీ జి ఎల్ ఐ పాలసీలకు బోనస్ ప్రకటన, ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహణ, రీయంబర్స్మెంట్ రెండు లక్షల నుంచి 5 లక్షల పెంపు, బిల్లుల మంజూరులో ఆలస్యాన్ని సవరించటం, ఒప్పంద ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు, రెండు సంవత్సరాల ఉద్యోగ కాలం పూర్తి చేసిన గ్రామ వార్డు సచివాలయు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు
చిత్తూరు జిల్లా అడహాక్ కమిటీ ఏర్పాటు: తిరుపతి జిల్లాలోని ఏపీ ఏన్జి జి వో సమావేశంలో తిరుపతి జిల్లా ఆడహాక్ కమిటీ ఏకగ్రీవం గా ఎన్నికైంది
ఛైర్మెన్ గా యస్ సురేష్ బాబు, కోకన్వీనర్ గా సి రఘు, కోశాధికారి గా వి లలిత కుమార్ కమిటీ సభ్యులు గా చెంచు రత్నం పణింద్ర జనార్దనయ్య ఉపాధ్యక్షలు గా శవణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. జగదీశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షలు వై ప్రసాద్ యాదవ్,కడప జిల్లా అధ్యక్షలు బి శ్రీ నివాసులు, నెల్లూరు జిల్లా అధ్యక్షలు యం పెంచల్ రావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ. తిరుపతి తాలూకా అధ్యక్షలు యస్ సురేష్ బాబు, కార్యదర్శి బాలాజీ మరియు జిల్లా నాయకులు అన్ని తాలూకా కార్వర్గ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News