మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాతో ఆరోగ్యం, ఆనందకరమైన జీవనం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నగరంలోని గొడుగుపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో సత్య సేవ యోగ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న యోగామృత ప్రాసన క్రియ 5 వ బ్యాచ్ పరిచయ వేదికను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
అనంతరం సత్యసాయి సేవకులు యోగ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతూ యోగ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగ అనేది ఒక శాస్త్రము, కళాత్మక జీవనము, తత్వంతో కూడిన సాంకేతిక సమ్మేళనం అని అంటూ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వ్యక్తిత్వ వికాసాన్ని ఏవిధంగా చక్కదిద్దుకోవాలో విశదీకరించారు.
ఈ యోగా శిక్షణ తరగతులు ఈనెల 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ డిఎం పెద్దిరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, సత్య సాయి సేవ సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News