-దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి పోస్టర్ను ఆవిష్కరించిన ఆర్డీవో రాణి సుస్మిత, తదితరులు
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరులో అక్టోబర్ 27వ తేదీన జరగనున్న గోదావరి హారతి కార్యక్రమం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగే గోదావరి హారతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వీక్షకుల సౌకర్యార్థం సిట్టింగ్ ఏర్పాట్లు పెంచుతున్నామనీ తెలిపారు. మూడు పంట్లు ఏర్పాటు చేసి వేదికను విశాలంగా మార్చినట్లు వివరించారు. గతసారి తలెత్తిన లోపాలను పరిగణనలోకి తీసుకొని ఈసారి ప్రతిష్టాత్మకంగా, సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి వారి సంప్రదాయం ప్రకారం గోదావరి తీరంలో హారతి కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ఆమె తెలియ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, లోకకల్యాణం కోసం ఈ హారతి కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మికంగా, ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సురపునేని చిన్న, పిల్లలమర్రి మురళీకృష్ణ, దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఎన్.వి. శివరామకృష్ణ, కలగర శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News