న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. వృత్తిపరమైన భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్–2020 అమలులో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై, ముఖ్యంగా నిర్మాణ రంగం, గనులు, కాంట్రాక్ట్ కార్మికులు వంటి ప్రమాదకర రంగాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, 13 కేంద్ర కార్మిక చట్టాలను కలిపి ఈ కొత్త కోడ్ తీసుకొచ్చామని తెలిపారు. దీని వల్ల చట్టాలు సులభంగా మారి, అన్ని రంగాలకు ఒకే విధమైన భద్రతా నిబంధనలు అమలులోకి వస్తాయని చెప్పారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేసే సంస్థలకు ఈ కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కార్మిక వ్యవహారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత కావడంతో, కోడ్ అమలులో రెండింటికీ స్పష్టమైన బాధ్యతలు కేటాయించామని తెలిపారు. ఈ కోడ్ అమలుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను 2025 డిసెంబర్ 30న విడుదల చేసి, సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరినట్లు చెప్పారు. కోడ్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వి.వి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ద్వారా రాష్ట్ర అధికారులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
ఆన్లైన్ శిక్షణ కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ఉద్యోగ ప్రదేశాల్లో భద్రతా నిబంధనలు పాటించడం, భద్రతా ఆడిట్లు నిర్వహించడం, ప్రమాదాలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం యజమానుల బాధ్యతగా ఈ కోడ్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు విధించే అవకాశం కూడా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం కాపాడటమే లక్ష్యంగా ఈ కోడ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News