విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రిలో ఇటీవల జరిగిన దుర్ఘటన దృష్ట్యా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి ఆదేశానుసారం ఈరోజు విజయవాడ పట్టణంలో లూజ్ మిల్క్ అమ్ముతున్నటువంటి వివిధ అవుట్ లెట్స్ పై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారితో కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. విజయవాడలోని కృష్ణలంక, పంటకాలువ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు, గురునానక్ కాలనీ తదితర ప్రాంతల్లో తనిఖీలు చేశారు. ఔట్లెట్స్ నుండి 7 శాంపిల్స్ ని సేకరించటం జరిగింది. ఈ శాంపుల్స్ ని పాల నాణ్యత నిర్ధారణ కొరకు హైదరాబాదులోని విమ్టా ప్రయోగశాలకు పంపించడం జరుగుతుంది. ఈ రెయిడ్స్ నిరంతరంగా జిల్లాలో కొనసాగుతూనే ఉంటాయి.
పాలలో జరిగే వివిధ కల్తీలకు సంబంధించి కొన్ని చిట్కాలను పాటించవలసిందిగా వినియోగదారులకు సూచిస్తున్నాం పాలు బాగా చిక్కగా ఉండటానికి పాలలో పిండిని కలపటానికి అవకాశం ఉన్నది. దీనిని తెలుసుకొనుటకుగాను కొద్దిగా పాల శాంపుల్ తీసుకొని దీనిలో రెండు చుక్కలు అయోడిన్ ని వేసినట్లయితే పాలు నీలి రంగు లోకి మారుతాయి. పాలల్లో అధిక వెన్న శాతం కొరకు వెజిటబుల్ నూనెలను కలుపుతారు. పాలు జిడ్డుగా ఉన్నట్లయితే దీనిని అనుమానించవచ్చు. పాలు చేదుగా ఉన్నా, దుర్గంధం తో ఉన్నా అటువంటి పాలను వినియోగించరాదు.
స్వచ్ఛమైన పాలు త్వరగా చెడిపోతాయి. పాలు ఎక్కువసేపు చెడిపోకుండా నిల్వ ఉన్నాయంటే వాటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్ ని వాడినట్లుగా అనుమానించాలి.
పాల కల్తీపై మీకు అనుమానం ఉన్నట్లయితే ఫుడ్ సేఫ్టీ వారికి కానీ, పశుసంవర్ధక శాఖ వారికి కానీ తెలియపరచినట్లయితే ఆ పాల శాంపిల్స్ సేకరించి, కల్తీ పాలుగా తేలినట్లయితే నిర్ధారణ అయినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును.
పాలను ప్లాస్టిక్ లేదా అల్యూమినియం క్యాన్లలో రవాణా చేయరాదు. కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే రవాణా చేయాలి. లూజ్ పాలు అమ్మే వారు పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
Prajavartha Online Telugu News