-జిల్లా పరిపాలన విషయంలో జిల్లా యంత్రాంగం పై మరింత బాధ్యత
-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జిల్లాల పనితీరుపై ప్రత్యక్ష పర్యవేక్షణ, సమగ్ర సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిపాలన యంత్రాంగం ఒక టీం గా మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనం పెంచే విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలకు అందించే పౌర సేవలు, సేవల నాణ్యత, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారం, చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఫలితాల ఆధారిత ప్రమాణాలపై క్రమం తప్పకుండా విశ్లేషణ జరుగుతోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. పౌర సేవలు విషయంలో పాలన పనితీరు అంచనాను ప్రజా పనితీరు ప్రమాణాలు (Public Performance Parameters – PPP), ముఖ్య పనితీరు సూచికలు (Key Performance Indicators – KPIs) మరియు ఇతర మూల్యాంకన ఆధారాల ప్రకారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రతి శాఖ తన పరిధిలో విధుల నిర్వహణను ప్రామాణిక కార్యాచరణ విధానం (Standard Operating Procedure – SOP) ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. సేవల సామర్థ్యం, ముఖ్య పథకాల అమలు పురోగతి, ప్రజా అభిప్రాయం (Perception), ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, ఫలితాల ప్రమాణాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. జిల్లా అవసరాలు, ప్రజల ఆకాంక్షల ఆధారంగా అదనపు ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ప్రణాళిక మండలి మంత్రిగారి అధ్యక్షతన, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్లమెంట్ సభ్యునితో సంప్రదింపుల సమావేశం నిర్వహించి జిల్లా ప్రాధాన్యతలను ఖరారు చేయాలని ఆమె వివరించారు. ప్రణాళిక శాఖ అందించిన అంశాలను సమీక్షించి, సంబంధిత శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో చర్చించి విధాన పరమైన అంశాలు, అమలు సవాళ్లు, పెండింగ్ అనుమతులు, అంతరశాఖ సమన్వయం వంటి విషయాలను పరిశీలించాలని తెలిపారు.
ప్రతి నియోజక వర్గంలో ప్రాధాన్యత అంశాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని , అందులో మూడు ఆర్థిక ప్రాధాన్యతలు (Financial Priorities), మూడు ఆర్థికేతర ప్రాధాన్యతలు (Non-Financial Priorities) ఉండాలని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే తక్షణ ఫలితాల కార్యక్రమాలకు (Low Hanging Initiatives) ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం (20:80 నిష్పత్తి ) అందే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. అలాగే జిల్లా స్థాయిలో స్వీయ అంచనా (Self- Assessment) నిర్వహించి, అందులో భాగంగా తొలుత 75 శాతం పైగా ప్రజా అభిప్రాయం ఉన్న పది కార్యక్రమాలను గుర్తించి, వాటిని 80 శాతం పైగా సానుకూల అభిప్రాయానికి తీసుకెళ్లే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 75 శాతం కంటే తక్కువ అభిప్రాయం ఉన్న కార్యక్రమాలపై సరిదిద్దు చర్యలు తీసుకొని పనితీరును మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.
అన్ని శాఖలు నిర్దేశించిన ప్రామాణిక నమూనా (Standard Template) ప్రకారం ఖచ్చితమైన, నవీకరించబడిన, ధృవీకరించబడిన సమాచారాన్ని సమర్పించాలని ఆమె ఆదేశించారు. జిల్లాల మధ్య సరితూగే విధంగా ఏకరీతి ప్రమాణాలు పాటించడం ద్వారా పారదర్శకత, సమర్థత, ఫలితాల ఆధారిత పరిపాలన సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
Prajavartha Online Telugu News