న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
పులికాట్ సరస్సులో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర మత్స్యకారుల వివాదం గురించి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ 377 ద్వారా లోక్సభలో ప్రస్తావించారు. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు సుమారు 24 గ్రామాల ప్రజలకు ప్రధాన జీవనాధారమని, ఆ ప్రాంతంలో సుమారు 70 శాతం మంది ప్రజలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. పన్నంగాడు ప్రాంతం జీపీఎస్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిధిలోనే ఉన్నాయని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు తరచూ చొరబడుతున్నారని సభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ చొరబాట్ల వలన మత్స్యకారుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని, పక్క రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, చేపల వేటకు ఆటంకం ఏర్పడటంతో స్థానిక మత్స్యకారుల జీవనాధారం తీవ్రంగా దెబ్బతింటోందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం తోపాటు పెద్ద పడవల ద్వారా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన రిజర్వ్ మత్స్యకార ప్రాంతాల్లో అక్రమంగా ప్రవేశించి చేపల వేట నిర్వహిస్తున్నారని, గతంలో కూడా రూల్ 377 కింద కూడా ప్రస్తావించినప్పటికీ ఇప్పటికీ సమస్య కొనసాగుతోందని ఆయన అన్నారు.
పులికాట్ సరస్సు ముఖద్వారం తెరవడానికి సాగరమాల పథకం కింద సూత్రప్రాయ అనుమతి లభించినప్పటికీ ఆ ప్రాజెక్టు ఇంకా పెండింగ్లోనే ఉందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను కట్టుదిట్టంగా అమలు చేయడం, గస్తీ చర్యలను బలోపేతం చేయడం, జియోఫెన్సింగ్ వ్యవస్థను అమలు చేయడం, పులికాట్ సరస్సు ముఖద్వారం తెరవడానికి సంబంధించిన ప్రాజెక్టును వేగవంతం చేయడం, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనాధారాన్ని రక్షించే చర్యలు తక్షణం చేపట్టాలని ఎంపీ గురుమూర్తి ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Prajavartha Online Telugu News