– కళాత్మక చేనేత వస్త్రాలకు వేదికగా గాంధీ బునకర్ మేళా
– ఈ నెల 31వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహణ
– ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ చేనేత కళాకారులను ప్రోత్సహించాలి
– పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత, జౌళి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేతకు చేయూతే లక్ష్యంగా, చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి గాంధీ బునకర్ మేళా (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన)ను నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత, జౌళి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (చేనేత, జౌళి) ఆర్పీ సిసోడియా అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత గాంధీ బునకర్ మేళాను ఆర్పీ సిసోడియా.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, అధికారులతో కలిసి విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో బుధవారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల చేనేత సంఘాలు, చేనేత సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన 115 స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి 112 చేనేత సంఘాలు, చేనేత సంస్థల స్టాళ్లు మేళాలో ఉన్నాయని.. రాష్ట్రం నుంచి 47 చేనేత సంఘాలు పాల్గొన్నాయని వివరించారు. గతేడాది ఈ మేళాలో రూ. 3 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని.. ఈసారి ఇది మరింత పెరిగే అవకాశముందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగుజిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకొని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు.
వినూత్న డిజైన్లతో వస్త్ర మేళా: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వినూత్న డిజైన్లతో అద్భుతమైన చేనేత వస్త్రాలకు గాంధీ బునకర్ మేళా వేదికగా నిలుస్తోందని, ప్రతిఒక్కరూ ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఉగాది, వేసవి నేపథ్యంలో జరుగుతున్న ఈ మేళాలో అపూర్వమైన వస్త్రాలు కొలువుదీరాయని.. ఎన్టీఆర్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల ప్రజలు మేళాను సందర్శించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతను, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ కింద ఉన్న కొండపల్లి బొమ్మలను వినూత్న డిజైన్టతో కళాప్రియులను అలరించేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.
కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్ జి.రాజారావు, ఆప్కో జీఎం కె.కన్నబాబు, విజయవాడ వీవర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్సాహు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News