-ఎన్-9 రహదారిపై పసుపు సోయగాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిరోజూ రాష్ట్ర సచివాలయానికి వచ్చేటప్పుడు పసుపు రంగు పూలు అందంగా, ఆహ్లాదకరంగా, ప్రకృతి సోయగానికి ఆలవాలంగా ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాట. అవే టెకోమా గాడి చౌడి పూలు. ప్రజా రాజధాని అమరావతిలో సీడ్యాక్సెస్ జంక్షన్ నుంచి సచివాలయానికి వెళ్లే ఎన్-9 రహదారిలో రెండు సెంట్రల్ మీడియన్ డివైడర్లపై అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) అధికారులు ఈ టెకోమా గాడి చౌడి పూల మొక్కలను పెంచుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత స్థాయి రాజధానిగా తాను అమరావతి నుంచి ఆశిస్తున్నది ఈ స్మార్ట్ అభివృద్ధేనని ఈ సమావేశంలో ముఖ్యమంత్రివర్యులు అధికారులకు వివరించారు. టెకోమా గాడి చౌడి పూల చెట్లను ఏడీసీ ఛైర్పర్సన్ డి.లక్ష్మీపార్థసారథి వారి సూచనల మేరకు గ్రీనరీ విభాగం అధికారులు వినూత్న ఆలోచనలతో పరిరక్షిస్తున్నారు. ఇవి పూర్తిగా కడియం నర్సరీల నుంచి తీసుకువచ్చిన హై బ్రీడ్ పూల మొక్కలు.
365 రోజులూ పూలతో అందంగా దర్శనమిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు మరింత ఆకర్షణీయంగా ఉండాలనే ఆలోచనతో ఘన జీవ అమ్రుతాన్ని వినియోగిస్తున్నారు. నూరుశాతం సేంద్రీయ ఎరువులనే వాడుతున్నారు. ముఖ్యంగా టెకోమా గాడి చౌడి పూల చెట్లు పూర్తిగా మన రాష్ట్రానికి చెందిన మొక్కలుగా పేరొందాయి. మన పెరట్లో ఉవ్వెత్తున పూసే టెకోమా గాడి చౌడి మొక్కలను ఎన్ – 9 రోడ్డుపై ఏడీసీ అధికారులు సుమారు 2 కిలోమీటర్ల మేర పెంచుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి సచివాలయం వరకు ఆకర్షణీయంగా చూపరులను కనువిందు చేస్తున్నాయి.
నిర్వహణ ఘనం:
టెకోమా గాడి చౌడి పూల మొక్కలకు నెలకోసారి ప్రూనింగ్ చేస్తారు. తద్వార కొమ్మలు తగ్గి పసుపు రంగు పువ్వులు మొక్కకు బుట్టమాదిరి పూస్తాయి. ప్రత్యేకించి ఆరుగురు గార్డెన్ సిబ్బంది వీటిని నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజూ మొక్కలకు కలుపు తీయటం, కుదర్లు సరిచేయటం వంటి నిర్వహణ చేస్తున్నారు. ఈ రెండు కిలీమీటర్ల మేర ఆరు ట్యాంకర్లతో వాటరింగ్ చేస్తున్నారు. మొక్కలు పశువుల భారిన పడకుండా ప్రత్యేకించి సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. రాజధాని అమరావతి నగరంలో ఎన్ – 10(ఆర్టీరియల్ రోడ్డు), ఎన్ – 16(సబ్ ఆర్టీరియల్ రోడ్డు) రహదార్లపైనా ఈ మొక్కలను పెంచేందుకు ఏడీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Prajavartha Online Telugu News