-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం అభినందించ దగ్గ విషయమని, ఈ తీర్మానం భావితరాలకు భరోసానిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో 33 వేల ఎకరాలు సేకరించడం చరిత్రలో మొట్టమొదటిసారన్నారు. ఇది సీఎం చంద్రబాబుకే సాధ్యమని కొనియాడారు. అమరావతికి స్వాగతిస్తున్నానని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మభ్యపెట్టి, అధికార గర్వంతో మూడు ముక్కలాట ఆడుతూ ప్రజలను భయబ్రాంతులకు, గందరగోళాలకు గురిచేశారని జగన్ పై మంత్రి సవిత మండిపడ్డారు. అమరావతికి చట్టబద్ధతకు శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానానికి మద్దతుగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత అప్పులతో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ప్రమాణా స్వీకారం చేసిన రోజున లోటు బడ్జెట్ తో పాటు కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి పథం వైపు దూసుకెళ్లిందన్నారు. సీమాంధ్ర ప్రజల నూతన రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు ఎంపిక చేసినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయన్నారు. సీఎం చంద్రబాబు పిలుపునకు స్పందిస్తూ…రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు అందజేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ లో భూములు సేకరించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. చరిత్రలో ఎక్కడా ఇలా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించిన దాఖాలాల్లేవవ్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఆయన దేశంలో ముఖ్యమైన నదుల్లో జలాలు, పుణ్యక్షేత్రాలకు చెందిన మట్టిని అందజేసి అమరావతి నిర్మాణానికి అందజేసి దీవెనలు అందజేశారన్నారు.
*తీర్మానంతో భావితరాలకు భరోసా*
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీ తీర్మానం అభినందించదగ్గ విషయమని, ఈ తీర్మానం భావితరాలకు భరోసానిస్తుందని మంత్రి సవిత తెలిపారు. నవ్యాంధ్ర ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని, ముఖ్యంగా పెట్టుబడిదారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. అమరావతి నిర్మాణంపై మాట చెప్పడమే చేసి చూపుతున్నారు సీఎం చంద్రబాబును కొనియాడారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణ త్యాగాలు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించుకున్నామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని తెలిపారు. ఒకవైపు అమరావతి రాజధానిని నిర్మిస్తూనే, మరో వైపు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను కూడా సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రాంతాల వారీగా హార్టీకల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, పారిశ్రామిక హబ్, టెక్స్ టైల్స్ హబ్, లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ది చేస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతం సంపద సృష్టించడమే కాకుండా ఉద్యోగాల కల్పనకు కీలకం కానుందన్నారు.
*జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం*
30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చొన్న జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని మంత్ర సవిత గుర్తు చేశారు. ‘అమరావతిని నేను స్వాగతిస్తున్నాను… నేను ఒప్పుకుంటున్నాను… ఇల్లు కూడా కట్టుకున్నాను’ అని ప్రజలను నమ్మించారన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఎక్కడ సభ జరిగినా ఇదే మాట చెపుకుంటూ వచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన అమరావతిపై మాటతప్పి, మూడు ముక్కలాట ఆట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్ తీరును ఎండగడుతూ ఆనాడు టీడీపీ, బీజేపీ, జనసేన, ప్రజా సంఘాలతో రాజధాని ప్రాంత రైతుల పెద్ద ఎత్తున నిరసన తెలిపారన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాకతో మరోసారి సుందర అమరావతి నిర్మాణ పనులు ఊపందకున్నాయన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేయడం ద్వారా భవిష్యత్తుల్లో మరెవరూ రాజధాని కదపడానికి అవకాశం ఉండదన్నారు. తీర్మానం ప్రవేశపెట్టినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News