అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి మూల్యాంకనం 6 నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా ఆంగ్ల ప్రశ్నాపత్రము మరియు భౌతిక శాస్త్ర ప్రశ్నాపత్రాలలో అభ్యసనా స్థాయిలకు అనుగుణంగా లేని ప్రశ్నలకు విద్యార్థులకు నష్టం జరగకుండా అదనపు మార్కులు ఇవ్వాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో రోజువారి నిర్దేశిత సిలబస్ బోధించమని విద్యాశాఖ ఆదేశించిందని, ప్రస్తుత ప్రశ్నాపత్రాలను పరిశీలించిన పిదప ఏం సమాధానం చెబుతారని రాష్ట్రోపాధ్యాయ సంఘం ప్రశ్నించింది. రైజింగ్ స్టార్లు, షైనింగ్ స్టార్ల పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కేవలం ఆ సిలబస్ కు పరిమితం చేసి ప్రశ్నాపత్రాల తయారీలో కఠినత్వాన్ని ప్రదర్శించారని దీని ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. దీనిపై ప్రభుత్వం మూల్యాంకనంలో న్యాయం జరిగేలా విషయ నిపుణులతో చర్చించి సంబంధిత ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని కోరారు.
Prajavartha Online Telugu News