-ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి
-గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ప్రతీక అని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి అధికారి బాధ్యత అని, జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 97 అర్జీలు వచ్చాయని, ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిస జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17, పోలీసు శాఖకు 14, రెవెన్యూ శాఖకు 11, వైద్య ఆరోగ్యానికి 8 అర్జీలు వచ్చాయన్నారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు అయిదేసి చొప్పున అర్జీలు వచ్చినట్లు వివరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ అండ్ బీ, భవనాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యకు రెండు చొప్పున అర్జీలు రాగా విద్యుత్, జెడ్పీ సీఈవో, పౌర సరఫరాలు, ఎండోమెంట్, మత్స్య, అడవులు, కార్మిక, మార్కెటింగ్, కాలుష్య నియంత్రణ, ఆర్ఐవో, గ్రామీణ నీటి సరఫరా, ఎస్సీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు వివరించారు.
పెండింగ్లో ఉన్న అర్జీలపై అధికారులు క్రమంతప్పకుండా ఫాలోఅప్ చేయాలని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, సమస్యల మూల కారణాలను గుర్తించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
ఆత్మీయతతో పలకరించి.. సమస్యను శ్రద్ధగా విని..
జరబాల లచ్చీ రామ్ అనే మహిళ తనకు స్వంతంగా నివాసానికి అనుకూలమైన ఇంటి స్థలం కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను ఆశ్రయించి అర్జీ సమర్పించారు. ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న నివాస సమస్యలను వివరంగా వినిపిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా సహాయం అందించాలని వినతిపత్రంలో కోరారు. అర్జీని స్వీకరించిన కలెక్టర్, ఆమె పరిస్థితులను సానుభూతితో పరిగణనలోకి తీసుకొని సంబంధిత వివరాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం, అవసరమైన వివరాలను వెంటనే సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమెకు ఇంటి స్థలం మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇలాంటి అర్జీల విషయంలో ఆలస్యం చేయకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాథమిక అవసరాలలో గృహ వసతి ముఖ్యమైనదని, అందువల్ల ఇలాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News