-రియల్ టైమ్లో నిందితులను పట్టిస్తున్న సీసీకెమెరాలు
-తిరువూరులో చోరీ చేసిన దొంగను పట్టించిన కెమెరాలు
-ఒంగోలులో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి ఆట కట్టించిన సర్వైలెన్స్
-కేసుల దర్యాప్తులో కీలకంగా మారుతున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ360
-ఏఎన్పీఆర్ అనలిటిక్స్ ద్వారా పోలీసులకు రియల్ టైమ్ అలర్టులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 7వ తేదీ తిరువూరులో ఓ చోరీ కేసు నమోదైంది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని సొత్తు, ఇంటి యజమాని బుల్లెట్ బైకుతో దొంగ ఉడాయించాడు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లోని సీసీటీవీ360 వ్యవస్థలోని సర్వైలెన్సు కెమెరాల ద్వారా ఆ బైకు, ఆ దొంగ కదలికలను రియల్ టైమ్లో కనిపెట్టడానికి సహకారం తీసుకున్నారు. ఆ బైకు నెంబరు ఆధారంగా ఆర్టీజీఎస్ లోని సీసీటీవీ360 వ్యవస్థ ద్వారా ఆ బైకు కదలికలను ఎప్పటికప్పుడు రియల్ టైములో పసిగట్టి పోలీసులకు ఫలానా ప్రాంతంలో ఆ బైకు ప్రస్తుతం వెళుతోంది అని రియల్ టైమ్ అలర్టులను ఆర్టీజీఎస్ నుంచి పోలీసులకు వెళ్లాయి. దీంతో పోలీసులు ఆ బైకు వెళుతున్న ప్రాంతంలో పోలీసులను అప్రమత్తం చేసి క్షణాల్లో ఆ బైకును, ఆ బైకుపై ఉడాయిస్తున్న నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేశారు.
ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో గండంకట్ట విప్పగుంట కూడలి వద్ద ఓ మైటారు బైకు వేగంగా వచ్చిన ఓ వ్యక్తి ఒక పాదాచారుడ్ని ఢీకొట్టి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హిట్-అండ్-రన్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఆర్టీజీఎస్లోని సీసీటీవీ360 వ్యవస్థ సహకారం కోరారు. ఆ బైకు నంబరు ఆధారంగా ఆర్టీజీఎస్లోని సీసీటీవీ360 వ్యవస్థ ద్వారా ఆ బైకు కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. ఈ నెల 12న ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న
ఆర్టీజీెస్ కెమెరా ఆ వాహనాన్ని గుర్తించింది. ఆ వెంటనే అది రియల్ టైమ్ అలర్టును పోలీసులకు అందజేసింది. ఆ బైకు ఏ మార్గంలో వెళుతుందో కూడా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడ్ని రియల్ టైమ్లో బైకుతో సహా పట్టుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలోని సీసీటీవీ360 వ్యవస్థ పోలీసులకు కేసు దర్యాప్తులో ఎంత కీలకంగా సహకారం అందిస్తుందనే చెప్పడానికి ఇవి తాజా ఉదాహరణలు మాత్రమే. రాష్ట్ర వ్యప్తంగా ఉన్న అత్యాధునిక సీసీటీవీల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ ప్రస్తుతం ఆర్టిఫియల్ ఇంటిలిజెన్సు యూస్ కేసెస్తో అద్భుతమైన సహకారాన్ని పోలీసులకు అందిస్తోంది.
దొంగలు తమను ఎవ్వరూ చూడలేదు అనుకునే రోజులకిక అడ్డుకట్ట పడినట్టే. నేరాలకు పాల్పడేవారి ఆటకట్టించడానికి పోలీసులు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తున్నారు. ఆర్టీజీఎస్లోని సీసీటీవీ360 విభాగం పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు అత్యంత వేగంగా, పారదర్శకంగా జరగడానికి ఎంతో సహకరిస్తోంది.
ఏఎన్పీఆర్ విశ్లేషణ
ఆర్టీజీఎస్లోని సీసీటీవీ360 విభాగం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ఎలాంటి వాహనం కదలికలనైనా రియల్ టైములో కచ్చితమైన విశ్లేషణ చేయగలుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక చోట నేరానికి పాల్పడి బైకు, కారు లేదా మరే ఇతర వాహనంపైన అయినా పారిపోయినట్లయితే ఆ వాహనం నంబంరు ఆధారంగా ఆ వాహనం నేరం జరిగినప్పటి నుంచి ఏఏ ప్రాంతాల్లో సంచరించింది, ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ వైపు వెళుతుంది అనే వివరాలను సీసీటీవీ 360 వ్యవస్థ ఖచ్చితంగా విశ్లేషిస్తుంది. ఈ సమాచారాన్ని ఆర్టీజీఎస్ ఆ సమాచారాన్ని పోలీసులకు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు రియల్ టైమ్లో అలర్టులు పంపుతుంది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు వెంటనే అప్రమత్తమై తక్షణం ఆ వాహనం కదులుతున్న ప్రాంతానికి చేరుకుని నేరస్థులను పట్టుకుంటారు. తిరువూరు చోరీ కేసులో నిందితుడు చోరీ చేసి బుల్లెట్ బైకు చోరీ జరిగిన తర్వాత ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో సంచరించినట్లు సీసీటీవీ360 గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ సమాచారం నిందితుడ్ని అరెస్టు చేయడంలో పోలీసులకు ఎంతో కీలకంగా సహకరించింది.
ఎలా పనిచేస్తుందంటే
రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ 14,700 అత్యాధునికమైన సర్వైలెన్సు కెమెరాలను అమర్చింది. ఇవన్నీ కూడా ఆర్టీజీఎస్లోని సీసీటీవీ360 విభాగానికి అనుసంధానింపబడి ఉంటాయి. ప్రతి కూడలిలో, లేదా ప్రాంతంలో ఆయా కెమెరాలు 360 డిగ్రీల కోణలో అన్నివైపులా పరిసరాలను అక్కడి కదలికలను ప్రత్యక్షంగా గుర్తిస్తుంది. ఈ కెమెరాల్లో ఒకసారి ఒక వాహనం నెంబరు నమోదైతే ఇక ఆ వాహనం ఎక్కడికి వెళ్లినా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కెమెరాలు గుర్తు పట్టగలుగుతాయి. నేరాలు జరిగినప్పుడు అనుమానాస్పద వాహనాల నంబర్లను ఏఎన్పీఆర్ వ్యవస్థ ద్వారా మ్యాట్రిక్స్ సీసీ కెమెరాలు ఇట్టే పసిగట్టేసి దర్యాప్తు చేస్తున్న అధికార్లకు రియల్ టైములో అలర్టులను పంపగలుగుతుంది.
అన్నీ ఏఐ ఆధారిక కెమెరాలే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, ప్రభుత్వ లక్ష్యాల మేరకు రాష్ట్రంలోని అన్ని సర్వేలెన్సు కెమెరాలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు ఆధారిత కెమరాలుగా మార్చారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు ద్వారా ఆయా కెమెరాలనున్న ప్రాంతంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, ర్యాష్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ లాంటివి గుర్తిస్తాయి. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఆర్టీజీెస్ సీసీ కెమెరాల సాయం ద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి సహాయక చర్యలు అదించేందుకు ఈ వ్యవస్థ తోడ్పాటు అందిస్తుంది. దీంతోపాటు పలు బహుళ ఉపయోగకర యూస్కేసెస్ను కూడా వీటి ద్వారా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Prajavartha Online Telugu News