-స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నెల రోజులలో రాజాం మున్సిపాలిటీ పరిధిలో యూనిట్ పనులు ప్రారంభించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాం మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. రాజాం డంపింగ్ యార్డు లో 1.61 కోట్ల రూపాయలతో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు 80 సెంట్ల స్థలం కేటాయించారని, నెల రోజులలో ఆ స్థలం అప్పగించాలని మునిసిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. రోజుకు 20 మెట్రిక్ టన్నులు చెత్త ప్రాసెసింగ్ సామర్ధ్యం తో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. 50 శాతం గ్రాంట్ గా కంపాక్ట్ వాహనం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంటింటి తిరిగి చెత్త సేకరణకు 6 విద్యుత్ కంపాక్ట్ వాహనాలు అందిస్తామని చెప్పారు. త్వరలో స్వీపింగ్ మెషిన్ లు కూడా సరఫరా సరఫరా చేస్తామన్నారు.
డంపింగ్ యార్డ్ నిర్వహణపై చైర్మన్ పట్టాభిరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారుకు నోటీసు జారీ చేయాలని చెప్పారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రాజాం పట్టణంలో పింక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని, సానిటరీ నాప్కిన్స్ అందుబాటులో ఉంచాలని చెప్పారు.
స్వచ్ఛ సర్వేక్షణలో రాజాం మున్సిపాలిటీ జాతీయ స్థాయి లో 971 స్థానం, రాష్ట్ర స్థాయిలో 31 స్థానంలో ఉందని, ఈసారి మెరుగైన స్థానం సాధించుటకు కృషిచేయాలన్నారు. ట్రై కార్, పుష్ కార్ట్ ల కోసం, ఇతర పనులకు కార్పొరేషన్ నుండి రూ. 9.41 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ చేయాలన్నారు. అంతకు ముందు డంపింగ్ యార్డ్ వద్ద చైర్మన్ పట్టాభిరామ్ మొక్కలు నాటారు. ఈ సమావేశంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ కవిత, మునిసిపల్ కమిషనర్ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News