-క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యాలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సూర్యాలంక తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన ఆయన, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్ట్స్ను సందర్శించి గదుల లభ్యత, సేవల నాణ్యత, రెస్టారెంట్ ఆహార ప్రమాణాలపై ఆరా తీశారు. బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.
పర్యాటకుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకుల రక్షణ కోసం లైఫ్ గార్డులు, హెచ్చరిక బోర్డులు, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. సూర్యాలంక బీచ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాపట్ల జిల్లాను పర్యాటక హబ్గా అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకమని, రాబోయే రోజుల్లో మరిన్ని వినోద కార్యక్రమాలు, ఆధునిక వసతులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.0 పనుల పురోగతిని సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవీఎం చైతన్య, మేనేజర్లు సతీష్, నాగభూషణం, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, కాంట్రాక్టర్ సతీష్, డివిజన్ కార్యాలయ సిబ్బంది, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News