-28 జిల్లాలకు కలిపి రూ. 19.25 కోట్లు వ్యయం
-ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంపిణీ పూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా జ్వరాల నివారణకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా దోమ తెరల( లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్ -LLINs) పంపిణీని వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రూ. 19.25 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో 7.80 లక్షల మందికి (1.95 లక్షల కుటుంబాలు) ఉచితంగా 6,89,421 దోమ తెరల్ని పంపిణీ చేయాలని వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మలేరియా తీవ్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63,507 ( 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో), పార్వతీపురం మన్యం జిల్లాలో 26,338(8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో) చొప్పున దోమ తెరల్ని ఇప్పటికే పంపిణీ చేశారు.
రానున్న మూడు నెలల్లోగా రాష్ట్రంలోని మిగతా 26 జిల్లాల్లో 5,99,421 దోమ తెరల్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో పేర్కొన్నారు.
వసతి గృహాల్లోని విద్యార్థులకూ…
పంపిణీ చేయాల్సి ఉన్న 5,99,421 దోమ తెరల్లో 3,402 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు 2,55,799 దోమ తెరల్ని అందజేస్తామని మంత్రి తెలిపారు. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు అత్యధికంగా 21,380 దోమ తెరలు పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు 18,709, పార్వతీపురం మన్యం జిల్లాకు 16,396 చొప్పున దోమ తెరలు పంపిణీ చేయనున్నారు.
దోమ తెరల ఉపయోగం
మలేరియా నివారణలో దోమతెరలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి దోమల కాట్ల నుంచి రక్షణ కల్పించి వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తాయి. మలేరియా కేసులు తగ్గేందుకు దోహదపడతాయి.
Prajavartha Online Telugu News