-జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ప్రాంత అభివృద్ధికి అపార సేవలు అందించిన మహనీయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నేటి తరానికి ఆదర్శప్రాయుడని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అన్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియా వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు..
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వెంకటాద్రి నాయుడు పరిపాలనలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రాంతీయ అభివృద్ధికి బాటలు వేసిన దూరదృష్టి గల నాయకుడని అన్నారు. అమరావతికి చారిత్రక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు అమరావతిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో వెంకటాద్రి నాయుడు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆలయాల అభివృద్ధి, సాగునీటి వనరుల విస్తరణ, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు ఆయన తీసుకున్న చర్యలు విశేషమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పరిపాలన అందించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. సమానత్వం, న్యాయం, సేవా భావం వంటి విలువలను ఆచరణలో చూపిన మహానుభావుడని వివరించారు. వెంకటాద్రి నాయుడు చూపిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News