విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో, ఉర్దూ భాష అభివృద్ధి లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ సారథ్యంలో “ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం మే 1 నుండి మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.
“ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం సందర్భంగా, ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ అధ్యక్షతన లిటరరీ కమిటీ సమావేశం నిర్వహించబడింది. లిటరరీ కమిటీ సహకారంతో రూపుదిద్దిన “ఆవో ఉర్దూ సీఖే – రండి ఉర్దూ నేర్చుకుందాం” అనే పుస్తకాన్ని మైనారిటీ & న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ తన చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారు అహ్మద్ షరీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ గౌస్ పీర్, లిటరరీ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో మరియు మైనారిటీ & న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
Prajavartha Online Telugu News