-జిల్లాకు రూ.3.04 కోట్లు కేటాయింపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రైతులు సాగుకు ఉపయోగించే యంత్ర పరికరాలను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (SMAM) పధకం క్రింద రాయితీ పై ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందు కోసం జిల్లాకు రూ.3.04 కోట్లు కేటాయిoచిందన్నారు. రైతులకు అవసరమైన పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, హార్వెస్టింగ్ త్రేషర్లు, పురుగు మందులు పిచికారి చేసేందుకు ఉపయోగించే స్ప్రేయర్లు ఇవ్వనున్నారన్నారు. వీటితోపాటు నూర్పిడి యంత్రాలు, విత్తన గొర్రులు, ట్రాక్టర్ తో పనిచేసే వ్యవసాయ అనుబంధ పరికరాలు, 40 హెచ్ పీ వరకు సామర్థ్యం కలిగిన రెండు మరియు నాలుగు చక్రాల ట్రాక్టర్లను కూడా రైతులకు రాయితీ పై అందచేయనున్నారని తెలిపారు. అవసరమైన పరికరాలు కొనుగోలు చేయుటకు ఎస్సి, ఎస్టి, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు, పరికరాల ఖర్చులో 50 శాతం, మిగత రైతులకు 40 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుందన్నారు. పరికరములు అవసరమైన వారు రైతు సేవ కేంద్రాలు, మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. త్వరలో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని అన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, అగ్రోస్ మరియు శాస్త్రవేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాయింట్ కలెక్టర్ సమక్షంలో పూర్తి పారదర్శకతతో లబ్దిదారుల ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. భూమి యజమానులతో పాటు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ (RoFR) రైతులు, గత మూడు సంవత్సరాల్లో కనీసం మూడు సీజన్లలో ఇ-పంట అప్లికేషన్లో నమోదు అయిన సి.సి.ఆర్.సి (CCRC) కలిగిన రైతులు అర్హులన్నారు. 2024–25 సంవత్సరంలో సబ్సిడీ పొందిన లబ్ధిదారులు అర్హులు కాదన్నారు. SMAM పథకం కింద ఒక కుటుంబం నుండి ఒక్క సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
Prajavartha Online Telugu News